ఇందిరాగాంధీ, హిట్లర్..వీళ్లిద్దరూ రాజ్యాంగాన్ని రద్దు చేసినవారే: అరుణ్ జైట్లీ

  • భారత్ ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా ఇందిర మార్చారు
  • ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను వేధింపులపాలు చేశారు
  • అప్పుడు ఆందోళన చేపట్టిన నేనూ జైలుకెళ్లాను
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని జర్మనీ నియంత హిట్లర్ తో పోలుస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిర, హిట్లర్..వీళ్లిద్దరూ రాజ్యాంగాన్ని రద్దు చేసిన వారేనని, ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చుకునేందుకు రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు.

నాడు ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయించిన హిట్లర్, తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, హిట్లర్ లా కాకుండా భారత్ ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా ఇందిరాగాంధీ మర్చారని, ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులపాలు చేసిందని, ప్రాథమిక హక్కులను కాలరాసి ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాపై ఆంక్షలు విధించారని, ప్రతిపక్షనేతలను జైళ్లలో పెట్టారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆందోళన చేపట్టినందుకు తాను కూడా జైలుకు వెళ్లానని చెప్పారు.
Go Back to Shorts
indira gandhi
hitler
Arun Jaitly

More Telugu News